27.1.16

బూడిద గుమ్మడికాయ వడియాలు

బూడిద గుమ్మడికాయ వడియాలు 


కావలసిన పదార్థాలు 
గుమ్మడికాయ - 1
మినప్పప్పు - 1/2 కేజీ
పండుమిర్చి - 200గ్రాములు
ఉప్పు - 1కప్పు (తగినంత)
ఇంగువ - 1 స్పూన్

తయారుచేయు విధానం 
వడియాలు పెట్టే ముందురోజు రాత్రి మినప్పప్పుని నానబెట్టుకోవాలి. గుమ్మడికాయని చిన్నముక్కలుగా తరిగి, ఒక బట్టలో మూటకట్టి, దానిపై బరువును ఉంచి, నీరు పోయే విధంగా ఏటవాలుగా ఉంచాలి. పొద్దునకల్లా నీరు పోయి ముక్కలు పొడపొడలాడుతూ ఉంటాయి.

మినప్పప్పుని గట్టిగా అంటే గారెలకు(వడలకు) రుబ్బినట్టుగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో గుమ్మడికాయ ముక్కలు,  ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పండుమిర్చి ముద్ద, ఇంగువ, ఉప్పుని వేసి, బాగా కలిపి ఎండలో ఒక కవరు పైన చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. మూడు రోజులు బాగా ఎండబెట్టిన తరవాత ఒక సీసాలో నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చును. ఇవి అన్నంలో తినొచ్చు. కొన్ని కొన్ని  కూరలలో కూడా వాడుకోవచ్చును. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి.

(వడియాలముద్దలో ఎండు కారం వేసుకోవచ్చును, అలా వేస్తే వడియాలు గుల్లగా ఉండవు, గట్టిగా వస్తాయి, అందుకే పండుమిర్చిని వాడితే చూడటానికి రంగు బావుంటుంది, తినటానికి రుచిగా ఉంటాయి.)   
                   

26.1.16

టమాట నిల్వ పచ్చడి

టమాట నిల్వ పచ్చడి 

కావలసిన పదార్థాలు 
టమాటాలు  - 5 కేజీలు 
(బాగా పెద్దవి, కొన్ని పచ్చివి, కొన్ని పండువి)   
చింతపండు - 1/2 కేజీ 
ఉప్పు - 3/4 కేజీ 
పసుపు - 5 స్పూన్స్ 
ఇంగువ - 2 స్పూన్స్ 
నూనె - 1 కేజీ 
ఆవాలు - 1 కప్పు 
కారం - 1 కేజీ 
మెంతిపొడి - 3 స్పూన్స్ 
(మెంతులను గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించి, చల్లారిన తరవాత మెత్తగా పొడిచేసి ఒక గాజుసీసాలో ఉంచుకోవాలి)   

తయారుచేయు పద్ధతి 
ముందుగా టమాటాలను బాగా కడిగి ఆరబెట్టాలి. ఆరిన తరువాత వాటిని ముక్కలుగా కోసి ఒక ప్లాస్టిక్ టబ్బులో వెయ్యాలి. ఆ ముక్కలలో  ఉప్పు, పసుపు వేసి, బాగా కలిపి మూడు రోజుల పాటు కదపకుండా పక్కన ఉంచుకోవాలి. అప్పుడు ముక్కలను బాగా పిండి, ఊట, ముక్కలను వేరు - వేరు చెయ్యాలి. ముక్కలు బాగా పొడిపొడిగా అయ్యేవరకు ఎండబెట్టాలి. ఊటలో చింతపండుని వేసి నానబెట్టాలి. ప్రతీరోజూ ఊటని, ముక్కలని బాగా ఎండబెట్టాలి. ఊట చిక్కబడాలి, ముక్కలు గలగలలాడుతూ ఉండాలి. అంతవరకూ ఎండబెట్టాలి. ముక్కలు బాగా ఎండిన తరవాత ఊటలో వేసి బాగా కలిపి మళ్ళీ ఊట మొత్తం చిక్కబడేటట్లు ఎండబెట్టాలి. అంతే ... ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోటిలో బాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. 





ఈ మిశ్రమంలో మెంతిపొడిని వేసి బాగా కలిపి, ఒక తడిలేని జాడీ, లేదా గాజుసీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి తయారయ్యింది. 





కొంచెం పచ్చడి మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని, దానికి తగినంత కారం గుండ కలుపుకొని, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకొని, వేడి -వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే .......... ఆహా ఏమి రుచి అని ఎవ్వరైనా అనక మానరు. 

(పచ్చడి పూర్తి అయ్యాక ఇష్టమున్నవారు మొత్తం పచ్చడిలో ఒకేసారి పోపు వేసుకోవచ్చు, లేకుంటే ఎప్పటికప్పుడు కొంచెం-కొంచెం పచ్చడిలో పోపు వేసుకోవచ్చు.)                      

17.1.16

కాశ్మీరీ పలావు

కాశ్మీరీ పలావు 


కావలసిన పదార్థాలు 
పలావు బియ్యం - 1/2 కేజీ
ఉల్లిపాయముక్కలు - 1 కప్పు
నెయ్యి - 3 స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు
గరం మసాలా - 1 స్పూను
పుదీనా ఆకులు - 1/2 కప్పు
జీడిపప్పు - 1/2 కప్పు
డ్రై చెర్రీ - 10
టుటీ  ప్రూట్ - 15 గ్రామ్స్
కుంకుమ పువ్వు - 1/4 గ్రామ్
పాలు - 1/2 కప్పు
అరటిపండు - 1
అల్లంవెల్లుల్లి  పేస్టు - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం 
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాలల్లో కుంకుమపువ్వు వేసి నానబెట్టి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి, ఉల్లిపాయముక్కలని పచ్చి వాసన పోయేవరకు వేయించుకొని, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు ,అన్నీ వేసి బాగా కలిపి వేయించాక, ఆ మిశ్రమంలో ఒక లీటరు నీళ్ళు పోసి, నీటిని బాగా మసలనియ్యాలి. నీరు మసిలి, పొంగుతున్న సమయంలో ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యాన్ని వేసి కలియబెట్టి మూతపెట్టి ఉడికించుకోవాలి. అన్నం మూడువంతులు ఉడకగానే, కుంకుమపువ్వు నానబెట్టిన పాలుపోసి, సన్నని మంటమీద ఉడికించాలి. బిరియానీ అంతా బాగా ఉడికిన తరవాత దానిపైన పుదీనా ఆకులని జల్లాలి. పైన జీడిపప్పు, డ్రై చెర్రీ, టుటీ  ప్రూట్, అరటిపండు ముక్కలు వేసి కలపాలి. అంతే .... ఎంతో  రుచికరమైన కమ్మని కాశ్మీరీ పలావు రెడీ. ఈ పలావుని కూరలేకుండా ఐనా తినొచ్చును, లేదా  ఏదైనా మసాలా కూరతో ఐనా తినొచ్చును.