21.7.13

మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి

మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి:--

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/23 కప్పు 
క్యారెట్ తురుము -- 1 కప్పు 
పాలకూర తురుము -- 2 కప్పులు 
పచ్చి బఠాణీ -- 1/2 కప్పు 
కాలిఫ్లోవేర్ -- 2 ముక్కలు 
బీన్స్ ముక్కలు -- 1కప్పు
క్యాప్సికం ముక్కలు -- 2 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు -- 2 కప్పులు
అల్లం & పచ్చిమిర్చి పేస్టు -- 3 స్పూన్స్
కొత్తిమీర తురుము -- 4 స్పూన్స్
పసుపు -- చిటికెడు
ఉప్పు -- తగినంత
నూనె -- 1/2 కప్పు

తయారీ విధానం:--
బియ్యం, పప్పు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, నూనె వేసి, పైనచెప్పిన మసాలా దినిసులు వేసి వేయించి, వేగిన తరవాత అల్లం, మిర్చి పేస్టు వేసి, అన్నిరకాలకూరల ముక్కలు వేసి వేయించి, కొంచెం వేగిన తరవాత కడిగి పక్కనపెట్టుకున్న బియ్యం,పప్పుని వేసి, తగినంత ఉప్పు మరియు నీరు పోసి బాగా కలియపెట్టి కుక్కర్ మూతపెట్టి, విసిల్ పెట్టాలి. 4 కూతలు వచ్చిన తరవాత దించి పక్కనపెట్టుకోవాలి. మూత తీసిన తరవాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి.... అంతే వేడి -- వేడి ఘుమఘుమలాడే మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి రెడీ.





18.7.13

దద్ధోజనం

దద్ధోజనం 

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 4 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
పెరుగు -- 5 కప్పులు 
అల్లం -- చిన్నముక్క 
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత 
పచ్చిమిర్చి -- 4 
పోపుసామను -- కొద్దిగా
నూనె -- కొంచెం

తయారీ విధానం:--
బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి మామూలు కంటే కొంచెం ఎక్కువగా నీరు పోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడిగి ఉంచుకున్న బియ్యం & పప్పును ఉడికించుకోవాలి. పెరుగులో ఉప్పు, దంచిఉంచుకున్న అల్లాన్ని , చీల్చి ఉంచుకున్న పచిమిర్చిని వేసి కలుపుకోవాలి. సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర & కరివేపాకు వేసి పోపు వేసి ఉంచుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం చల్లారక పెరుగులో కలుపుకోవాలి. 
ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును. అంతే కమ్మని దద్ధోజనం రెడీ. 





కట్టు పొంగలి

కట్టు పొంగలి 

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
నెయ్యి -- 50 గ్రాములు 
మిరియాలు -- 2 స్పూన్స్ 
జీలకర్ర -- 1 స్పూన్ 
అల్లం -- చిన్నముక్క 
ఇంగువ -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు

తయారీ విధానం:--
ముందుగా మిరియాలు & జీలకర్ర పొడిచేసి ఉంచుకోవాలి. ముందుగా బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి తగినంత నీరు పోసి, అల్లంముక్క మెత్తగా దంచి వేయ్యాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడిగిన బియ్యం, పప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి, దంచి ఉంచుకున్న మిరియాలు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి వేగిన తరవాత, ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని, తగినంత ఉప్పు & పసుపు వేసి బాగా కలియబెట్లి దించుకోవాలి. ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును.
అంతే వేడి వేడి కట్టుపొంగలి రెడీ.




11.7.13

రవ్వ ఇడ్లీ

రవ్వ ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:--
బొంబాయి రవ్వ -- 1/4 కేజీ 
అల్లం పేస్టు -- 1 స్పూన్ 
పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్ 
ఉప్పు -- రుచికి తగినంత
చిక్కటి పెరుగు -- 3 కప్పులు
కరివేపాకురెబ్బలు -- 4
పోపు సామాన్లు -- కొద్దిగా
నెయ్యి -- కొంచెంగా

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, 2 స్పూన్స్ నెయ్యివేసి, కరిగాక, బొంబాయి రవ్వను వేసి, మాడకుండా సన్నని మంటపై గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలో వేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో, పోపు వేసుకొని, అందులో అల్లం-- పచ్చిమిర్చి పేస్ట్లు , కరివేపాకు, పెరుగు వేసి, అందులోనే వేయించి పక్కనపెట్టుకున్న రవ్వను కూడా వేసి, బాగా కలియపెట్టి 2 నిముషాలు ఉంచి దించి పక్కనపెట్టుకోవాలి.

చల్లారిన తరవాత ఇడ్లీస్టాండ్ తీసుకొని, నూనె రాసుకొని, ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని, కుక్కర్ లో పెట్టి, స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, 15 నిముషాలు ఉంచితే ఇడ్లీలు రెడీ. అంతే వేడి - వేడి రవ్వ ఇడ్లీలు మీ ముందు సిద్దం.  ఈ వేడి-- వేడి ఇడ్లీలలను కొబ్బరి చట్నీతో తింటే చాలా బావుంటుంది. లేదా మనకి ఇష్టమైన చట్నీలతో తినొచ్చును.

ఈ రవ్వ ఇడ్లీలు చేసుకోవటం చాలా సులువు. పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం వంటి ఇబ్బందులు పడకుండాఉంటాము. మనకి అర్జెంటుగా ఇడ్లీలు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చును. 





బ్రెడ్ ఛాట్

బ్రెడ్ ఛాట్

కావలసిన పదార్థాలు
బ్రెడ్ -- 1 ప్యాకెట్
పచ్చిబఠాణీ -- 1 కప్పు (ఉడికించినవి)
బంగాళదుంప ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
టమాట ముక్కలు -- 1/2 కప్పు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
కొత్తిమీర -- (సన్నగా తరిగాలి) 2 స్పూన్స్
కారం & ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు
ఛాట్ మసాలా -- 1 స్పూన్
సన్న కారప్పూస -- 1 కప్పు
చింతపండు గుజ్జు -- 1 స్పూన్
నూనె -- కొంచెం

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెంగా నూనె వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీలను వేసి, అందులో ఉప్పు, కారం, చిటికెడు పసుపు, చింతపండుగుజ్జు, వేసి కలపాలి. తగినంత నీరు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి.

వేరే ఒక డిష్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలను, టమాటా ముక్కలను, కొత్తిమీర తురుమును వేసి, కలిపి ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంట మీద పెనం పెట్టి, ఒక్కొక్క బ్రెడ్ ముక్కని దోరగా, కరకరలాడే లాగా అన్ని ముక్కల్ని కాల్చుకొని, ఒక ప్లేట్ లో అమర్చుకొని, ఆ ముక్కలమీద బఠానీ కూర వేసి, ఉల్లిముక్కల మిశ్రమం ఆ పైన కారప్పూస చల్లుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన బ్రెడ్ ఛాట్ రెడీ. ఇది చెయ్యటం సులువు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. (ఇష్టమైతే మామిడికాయని  సన్నగా తురుములాగా చేసుకొని పైన వేసుకోవచ్చును.)


7.7.13

కచోరీలు

కచోరీలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి -- 1 కప్పు
నానబెట్టిన పెసరపప్పు -- 1/2 కప్పు
శెనగపిండి -- 1 కప్పు
గరంమసాలా పౌడర్ -- 1/4 స్పూన్
ఉప్పు & కారం -- తగినంత
అప్పడాల షోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం
ముందుగా మైదాపిండిలో ఉప్పు, అప్పడాలషోడా వేసి తగినన్ని నీళ్ళు పోసి, చపాతీపిండిలాగా కలుపుకోవాలి. పెసరపప్పుని ఒకగంట ముందు నానబెట్టుకొని, రుబ్బి, అందులో శెనగపిండి, ఉప్పు, కారం, గరంమసాలా వేసి, స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో ఈ మిశ్రమాన్ని వేసి, దగ్గరపడేవరకు ఉడికించి దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న - చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు మైదాపిండిని చిన్న చిన్న చపాతీలుగా వత్తుకొని, పెసరఉండలిని మధ్యలోపెట్టి, అంచులు మూసి, మళ్ళీ చపాతీలుగా వత్తుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నూనె పోసి, కాగిన తరవాత వత్తుకొని ఉంచుకున్న, కచోరీలను దోరగా వేయించి ఒక ప్లేట్ప లో ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిమీద మనకు ఇష్టమైతే, సన్నని కారపుపూస, కొత్తిమీర, టమాట, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలంకరించుకొని, ఇష్టమైన చట్నీలతో తినొచ్చును. అంతే కరకరలాడే కమ్మని కచోరీ రెడీ.



5.7.13

కొన్ని వంటింటి చిట్కాలు

కొన్ని వంటింటి చిట్కాలు


1. కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.
2. పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి.
3. నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.
4. వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి.
5. బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.
6. కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.
7. ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.
8. క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.
9. నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.
10. పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.


మిర్చీ బజ్జీలు

మిర్చీ బజ్జీలు

కావలసిన పదార్థాలుపచ్చిమిరపకాయలు --1/4 కేజీ (బజ్జీలకి అంటే లావుగా ఉండేవి తీసుకోవాలి)
శెనగపిండి -- 2 కప్పులు
బియ్యం పిండి -- 2 స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
ఉప్పు -- తగినంత
కారం పొడి -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
అప్పడాలషోడా -- 1/2 స్పూన్
నూనె -- 1/4 కేజీ
వాము పౌడర్ -- 2 స్పూన్స్
నిమ్మకాయలు -- 2

తయారీ విధానం
లావుగా ఉండే బజ్జీల మిర్చీలు తీసుకొని కడిగి, మధ్యకు చీల్చుకొని, కావాలంటే గింజలు తీయాలి. కరం తినేవారు ఐతే ఉంచుకోవచ్చును. ఇప్పుడు శెనగపిండిలో-- బియ్యం పిండి, ఉప్పు , జీలకర్ర పౌడర్, అప్పడాల షోడా అన్నీ వేసి తగినంత నీళ్ళు పోస్తూ, కొంచెం గరిట జరుగా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే, అంట బాగా బజ్జీలు పొంగుతాయి. మధ్యకు చీల్చిన మిరపకాయలలో ఉప్పు+ వాముని కలుపుకొని నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, మిరపకాయలను శెనగపిండిలో ముంచుకొని, నూనెలో వేయాలి.
అలాగ అన్నీ దోరగా వేయించి తీసుకోవాలి. అన్నీ వేయించి ఒక పళ్ళెంలో ఉంచుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలలో, కొంచెముగా ఉప్పు, కారం వేసుకొని నింపుకొని పైన నిమ్మరసం పిండుకోవాలి. అంతే అందరికీ ఇష్టమైన వేడి -- వేడి, రుచికరమైన మిర్చి బజ్జీలు రెడీ.



సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం -- 1 కప్పు
బియ్యంపిండి --1 కప్పు
శెనగపిండి -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి పేస్టు -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
పెరుగు -- 1 కప్పు
ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం
2 గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. బాగా ననిన తరవాత దానిలో బియ్యంపిండి, శెనగపిండి, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర పౌడర్ & ఉప్పు వేసి, గారెల పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక, ఒక పాలకవరు మీదైనా, లేకుంటే చేతిమీదనైనా పిండిని తీసుకొని, గుండ్రంగా చేసి నూనెలో వేసుకొని, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మనకి నచ్చిన చెట్నీతో నంజుకొని తినొచ్చును. అంతే వేడి -- వేడి, కరకరలాడే కమ్మని సగ్గుబియ్యం వడలు రెడీ.(ఇష్టమైన వారు ఈ పిండిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చును)



1.7.13

మైసూరు బోండాలు

మైసూరు బోండాలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి -- 2 కప్పులు
బియ్యంపిండి -- 1/2 కప్పు
పుల్లటి పెరుగు -- 2 కప్పులు
బొంబాయి రవ్వ -- 4 స్పూన్స్
అల్లం + పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- తగినంత
వంటసోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--
పైన చెప్పిన పదార్థాలు అన్నీ.... పుల్లటి పెరుగులో వేసి 2 గంటలు ముందు నానబెట్టుకోవాలి.ఈ పిండి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా నానితే, బోండాలు అంత మెత్తగా, మృదువుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, పిండిని కొంచెం-- కొంచెం చేతితో చిన్ని -చిన్ని ఉండలుగా తీసుకొని, నూనెలో వేస్తే గుండ్రంగా బోండాలు, పెద్దవిగా పొంగుతాయి. ఇలాగే అన్నీ వేయించి తీసుకొని, మనకి నచ్చిన చెట్నీతో తినొచ్చును. అంతే వేడి -- వేడి మెత్తని మైసూరు బోండాలు రెడీ......


సేమ్యా ఉప్మా:--

సేమ్యా ఉప్మా:--

కావలసిన పదార్థాలు--
బాంబినో సేమ్యా -- 250 గ్రాములు
పచ్చిమిర్చి -- 6
ఉల్లిపాయ ముక్కలు -- 1/2 కప్పు
అల్లం --ఒక చిన్నముక్క
నిమ్మకాయ --1
పోపు దినుసులు --సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు & కొత్తిమీర
టమాట ముక్కలు -- 1/4 కప్పు
పచ్చిబటాణీ -- కొద్దిగా
జీడిపప్పు ---15 పలుకులు
ఉప్పు --రుచికి సరిపడినంత
నూనె -- 100 గ్రాములు
నీళ్ళు -- 500 గ్రాములు (సేమ్యా ఎంత ఉంటే... దానికి రెండింతలు నీళ్ళు తీసుకోవాలి.)

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి, పోపు దినుసులు వేసి వేగాక జీడిపప్పు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పచ్చి బటాణీ , పచ్చిమిర్చి---అన్నీ వేసి వేగిన తరవాత, అందులో సేమ్యా కూడా వేసి దోరగా వేయించిన పిదప,నీళ్ళు పోసి, ఉప్పువేసి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. సేమ్యా అంతా దగ్గరికి వచ్చాక నిమ్మరసం, ఇష్టమైతే కొంచెంగా నెయ్యి వేసి దించుకోవాలి. వేరే డిష్ లో సర్వ్ చేసుకోవాలి. అంతే వేడి--వేడి సేమ్యా ఉప్మా రెడీ.