30.3.14

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి



ఉగాది పచ్చడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను.

ఈ పచ్చడిలో ఆరు రుచులు కలసి ఉంటాయి, ఆరు ఋతువులకు ప్రతీక---తీపి--చేదు, ఉప్పు--కారం, పులుపు--వగరు.

1) తీపిని కలిగించే కొత్త బెల్లం---ఆకలిని కలిగిస్తుంది.

2) పులుపునిచ్చే చింతపండు---కఫ వాతాలని పోగొడుతుంది.

3) కారం---శరీరంలోని క్రిముల్ని నాశనం చేయటమే కాక, శ్లేష్మ రోగాలని దరిచేరనీయదు.

4) వగరు పుట్టించే మామిడి--- లాలాజలాన్ని ఊరించి, జీర్ణక్రియకి తోడ్పడుతుంది.

5)వేపపువ్వు---కడుపులోని ఏమైనా అనారోగ్య దోషాలు ఉంటే, వాటిని దూరం చేస్తుంది. కడుపులో ఉన్న నులిపురుగును చంపి, తిరిగి పుట్టనీయకుండా చేస్తుంది. ఇందులోఇంకా చాలా ఔషధగుణాలున్నాయి.

6) ఉప్పు--ఎముకలని బలపరుస్తుంది.

మన సంవత్సర ఫలితం ఉగాది పచ్చడి మీద ఆధారపడి ఉంటుందట. తీపిఎక్కువగ ఉంటే, మనజీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అలా అని మనం కోరుండి తీపి ఎక్కువ వేసుకుని తినకూడదు. మనకు నచ్చిన, నచ్చకపోయినా తప్పనిసరి ఈ పచ్చడిని, ఈ ఒక్కరోజు తిని తీరాలి.

పచ్చడి తయారుచేయుటకు కావలసిన పదార్థాలు 

బెల్లం
వేపపువ్వు
చింతపండు
మామిడికాయ ముక్కలు (సన్నగా తురిమి ఉంచుకోవాలి)
ఉప్పు
కారంపొడి


తాయారు చేయు విధానం 

చింతపండును 15 నిమిషముల ముందు నానబెట్టి, పులిహోరకి తీసుకున్నట్టుగా చిక్కగా పులుసు తీసుకొని ఒక బౌల్ లోకి ఉంచుకోవాలి. అందులో -- వేపపువ్వును, (వేపపువ్వును రెమ్మలనుండి వలచి, రెండు అరచేతుల మధ్య ఉంచి, నులిమితే పువ్వు యొక్క సన్నని పొట్టు వస్తుంది.), సన్నగా తరిగి ఉంచుకున్న మామిడి ముక్కలను, తగినంత ఉప్పు & కారంను వేసి...... అన్ని బాగా కలపాలి. అంతే ఆరు రుచుల ఉగాది పచ్చడి రెడీ. 

ఇది అసలు ఉగాది పచ్చడి చేసే విధానం. కానీ కొంతమంది ఇందులో అరటిపండు ముక్కలు, జీడిపప్పు, కిస్స్మిస్స్ మొదలైనవన్నీ కలుపుతుంటారు. ఆ విధంగా కలిపితే ఆరు రుచులే కాకుండా ...... ఇంకా ఎక్కువ రుచుల సమ్మేళనం అవుతుంది కదా !  మీరే ఆలోచించండి. 

            

27.3.14

పూర్ణం బూరెలు

పూర్ణం బూరెలు 

కావలసిన పదార్థాలు
శెనగపప్పు -- 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
ఏలకుల పొడి - 2 స్పూన్స్
తోపుపిండి - 1 కప్పు మినప్పప్పు & 3 కప్పులు బియ్యం 3 గంటల ముందుగా నానబెట్టి దోసెల పిండిలాగా రుబ్బి ఉంచుకోవాలి.
నూనె - 1/2 కేజీ (బూరెలు నూనెలో మునిగే అంత)

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి శెనగపప్పును కుక్కర్లో బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కుక్కరు వెయిట్ తీసిన తరవాత పప్పులో పంచదార కలిపాలి. పంచదార కలిపగానే పప్పు జారుగా అంటే పలచగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి,  సన్నని మంటపై మిశ్రమం అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం గట్టిబడ్డాక, (దగ్గరగా అయిన తరవాత) దించి పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం చల్లారిన తరవాత ఉండలుగా అదేనండి పూర్ణాలుగా చుట్టి పక్కన ఉంచుకోవాలి.


ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి కాగాక ఒక్కొక్క పూర్ణాన్ని తోపుపిండిలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సాంప్రదాయపు పిండివంట పూర్ణం బూరెలు రెడీ.

              

26.3.14

క్యాబేజీ ఆవకూర

క్యాబేజీ ఆవకూర

కావలసిన పదార్థాలు:-
క్యాబేజీ - 1/4 కేజీ (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
పోపు సామాను - కొంచెముగా
కరివేపాకు - 3 రెబ్బలు
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు 
ఇంగువ - చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత
ఆవముద్ద --
(ఆవముద్ద తయారుచేయు విధానం ...... 2 స్పూన్స్ శెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2 స్పూన్స్  ఆవాలు , 3 పచ్చిమిర్చి ..... ఇవి అన్నీ కలిపి 1 గంట నానపెట్టి, రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది.) 

తయారీ విధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి, సన్నగా తరిగి ఉంచుకున్న క్యాబేజీని 10 నిముషాలు ఉడికించి, నీరు వంపి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో పోపుకి సరిపడినంత నూనె వేసి కాగాక  పోపుదినిసులు, కరివేపాకు, ఇంగువ వేసి, పోపు చిటపటలాడాక, ఉడికించి పక్కన పెట్టుకున్న క్యా బేజీని వేసి, అందులో రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, చింతపండు రసం(చింతపండు పులుసు) వేసి, ఒకసారి కలియబెట్టాలి. చివరిలో కూరని దింపే ముందు, ఆవముద్ద - కొంచెంగా నూనె వేసి కలపాలి......  దించి వేరే డిష్ లోకి తీసుకోవాలి. అంతే కమ్మటి క్యాబేజీ ఆవపెట్టిన కూర రెడీ.